2022 పోతూ పోతూ శాంటాక్లాజ్ ద్వారా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు బోలెడన్ని కష్టాలను క్రిస్మస్ గిఫ్ట్ గా ఇచ్చిపోతే.. 2023 సంవత్సరం వస్తూ వస్తూనే ఆ కష్టాలను వంద రెట్లు చేసింది. ప్రపంచం మొత్తం ఐటీ సంక్షోభం ఆవహిస్తోంది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలన్నీ లేఆఫ్స్ పేరిట ఉద్యోగులను ఇంటికి పంపించేస్తుంటే.. ఇక ఇప్పుడు చిన్న కంపెనీల వంతు కూడా వచ్చేసింది. మల్టీ నేషనల్ కంపెనీలే ప్రాజెక్టులు లేక ఉద్వాసన పర్వం కొనసాగిస్తుంటే.. ఆ కంపెనీల ప్రాజెక్టులను ఔట్ సోర్సింగ్ పేరుతో పూర్తి చేసి పెట్టే డొమెస్టిక్ కంపెనీల పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇక ఐటీ ప్రపంచాన్ని శాసించే అమెరికాలో ఐటీ రెసిషన్ విలయ తాండవం చేస్తోంది. గూగుల్, అమేజాన్ సహా అనేక కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగులను తగ్గించుకుంటోంది. ఇదే అమెరికాలోని ఇండియన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను గజగజ వణికిస్తోంది.
ఓ కంపెనీలో ఉద్యోగం పోతే మరో కంపెనీలో ఉద్యోగం వెతుక్కునే పరిస్థితైనా ఉండేది గతంలో.. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అన్ని కంపెనీలూ లేఆఫ్స్ పర్వం కొనసాగిస్తుంటే ఇక ఉద్యోగం దొరికేదెలా.. కరోనా పాండమిక్ సమయంలో ఉద్యోగాల కోత జరిగినా అది చాలా చాలా తక్కువ. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కు మారిపోయారే తప్ప పెద్దగా ఉద్యోగాల కోతల్లేవ్. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అయితే.. ఈ ఐటీ రెసిషన్ కు కారణం అమెరికా తీసుకున్న నిర్ణయాలే. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పెద్దన్న స్థాయిలో అడ్డు చెప్పాల్సింది పోయి.. రష్యా మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరికతో ఉక్రెయిన్ కు కోట్లాది డాలర్లను సాయంగా ప్రకటించి తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంది అమెరికా. దాని ఫలితమే ప్రస్తుతం ప్రపంచం పాలిట శాపంగా పరిణమించింది. వినాశనం దిశగా అమెరికా పోతూ పోతూ తన వెంట మిగితా ప్రపంచాన్ని కూడా ఈడ్చుకెళ్ళింది. దాని ఫలితమే అమెరికా కేంద్రంగా పనిచేసే దిగ్గజ కంపెనీలైన గూగుల్, అమేజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, స్ట్రైప్, హెచ్ పీ, ట్విటర్, గోల్డ్ మెన్ సాక్స్, అడోబ్.. ఇలా చాలా కంపెనీలు సుమారు లక్ష మంది సాఫ్ట్ ఉద్యోగులను రోడ్డున పడేశాయి. అందులో మనోళ్ళు కూడా ఉన్నారు. ఈ మాంద్యం కోరలు విరిచే బ్రహ్మాస్తం ఎవరి దగ్గర ఉందో.. ఎప్పుడు వస్తుందో.. ఎదురు చూడాలంతే.
