రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం మరింత పెరిగింది. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టడం.. రేవంత్ పై విమర్శలు చేయటం తెలిసిందే. తాజాగా రేవంత్ రెడ్డి మరో వివాదాన్ని తెరపైకి తెచ్చాడు. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రైతులపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. బషీర్ బాగ్ కాల్పుల ఘటనగా ఇది ఏపీ చరిత్రలో దారుణమైన పరిణామంగా నిలిచిపోయింది. విద్యుత్ కోసం ధర్నా చేస్తున్న రైతులపై ఆనాటి ప్రభుత్వం కాల్పులు చేయాలని పోలీసులకు ఆదేశాలివ్వటం.. కాల్పుల్లో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది. రేవంత్ రెడ్డి ఈ వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చాడు. ఆనాడు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న కేసీఆర్ ఈ బషీర్ బాగ్ ఘటనకు కారణం అంటూ తలా తోక లేని ఆరోపణ చేశాడు. దీనిపై మంత్రి హరీష్ రావు స్పందించాడు. శుక్రవారం సాయంత్రం ప్రెస్ మీట్ లో మాట్లాడిన హరీష్ రావు.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు.
రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందంటూ అవగాహన లేకుండా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు కారణం కేసీఆర్ అని చెప్పి ఈ శతాబ్ధంలోనే సూపర్ జోక్ చెప్పాడని సెటైర్ వేశాడు. తన రాజకీయ గురువైన చంద్రబాబు చేసిన దారుణాన్ని పాపం రేవంత్ రెడ్డి 23 యేళ్ళ తర్వాత కేసీఆర్ పేరిట ప్రచారం చేసే పని పెట్టుకున్నాడనీ.. కానీ తెలంగాణ ప్రజలకు, రైతులకు అన్నీ తెలుసు అనీ చెప్పాడు. అర్థరాత్రి కరెంటు ఇచ్చి రైతులను పాము కాట్లకు బలి చేసిన కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఇంత కంటే ఎక్కువ ఆలోచించలేదు అని వ్యాఖ్యానించాడు. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ఎజెండాయే రైతులకు కరెంటు అనే అంశం అనీ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న అతిపెద్ద నిర్ణయమే రైతులకు ఫ్రీ కరెంటు అనీ చెప్పాడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాల గురించి ప్రచురితమైన ఆనాటి పేపర్ క్లిప్స్ ను మీడియాకు చూపించి మరీ రేవంత్ పై ఫైర్ అయ్యాడు హరీష్ రావు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహంతో ఉండగా.. పార్టీకి చెడ్డపేరు తెచ్చే పనులు మానుకోవాలంటే సీనియర్లు తలంటు పోస్తున్నారు రేవంత్ రెడ్డికి.