కేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయంటూ జాతీయ మీడియాలో పెద్దఎత్తున కథనాలు ప్రచురితమవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మోడీ తన క్యాబినెట్లో మార్పులు చేయనున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా జూలై రెండో వారంలో కీలక మంత్రుల స్థానాలు మారబోతున్నాయని జాతీయ మీడియా బల్లగుద్ది చెప్తోంది. తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్లో మొన్నటి వరకూ కొనసాగిన కిషన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మారి మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఇంకొంత మంది మంత్రులు రాజీనామాలు చేయబోతున్నారనీ.. కీలక మంత్రిత్వ శాఖల విషయంలో కూడా బీజేపీ అధిష్టానం మార్పులు చేయబోతోందనీ సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. మంత్రుల పని తీరు దృష్ట్యా కొంత మంది మంత్రులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారనీ.. కొంత మంది మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించబోతున్నారనీ బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీ షెడ్యూల్ నాలుగు రాష్ట్రాల పర్యటనతో బిజీ బిజీగా ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర సహా మరో రెండు రాష్ట్రాల్లో మోడీ పర్యటన ముగిసిన అనంతరం జాతీయ కార్యవర్గం మరియు మంత్రి వర్గాలు సమావేశమై కొత్త నిర్ణయాలు తీసుకుంటాయని తెలుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధిష్టానం చాలా రోజుల క్రితమే మార్పులు చేర్పులు మొదలుపెట్టింది. కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీ వ్యూహాలు మరింత ఊపందుకున్నాయి. రాష్ట్రాల్లో బీజేపీకి ఆదరణ తగ్గటం పట్ల దృష్టిపెట్టిన అధిష్టానం.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఓట్లు పోకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చేసింది అధిష్టానం. జూలై రెండో వారంలో కీలక సమావేశాలు ముగిసిన తర్వాత మరిన్ని భారీ మార్పులు తప్పవని విశ్లేషకులు చెప్తున్నారు.