ఏపీ రాజకీయాలపై తరచుగా వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఈ సారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడి మళ్ళీ వార్తల్లోకెక్కాడు. సినిమా షూటింగ్స్ అన్నీ హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతున్నాయనీ.. ఏపీలో అసలు సినిమా, సీరియల్ షూటింగ్స్ జరగటం లేదనీ ఆవేదన వ్యక్తం చేసిన పోసాని.. దయచేసి ఏపీలో కూడా సినిమా పనులు చేయాలని ఇండస్ట్రీ పెద్దలను కోరారు. ఏపీలో సినిమా షూటింగ్స్ చేస్తే అన్ని రకాల అనుమతులు ఇస్తామనీ.. ఫ్రీగానే షూటింగ్స్ చేసుకోటానికి తమకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నాడు. హైదరాబాద్ లో కేంద్రీకృతమైన సినిమా ఇండస్ట్రీని ఏపీకి తరలించాలంటే అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించాల్సి ఉంటుందని చెప్పిన పోసాని.. అలా ఒప్పించటానికి అవసరమైతే కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటానంటూ వ్యాఖ్యానించాడు. బుధవారం మీడియాతో మాట్లాడిన పోసాని.. ఈ వ్యాఖ్య చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా మంచి వాడనీ.. మర్యాదపూర్వకంగా అడిగితే ఒప్పుకుంటాడని కూడా పోసాని చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్సే కాదు సినిమా, సీరియల్స్ కు సంబంధించిన అన్ని పనులు హైదరాబాద్ లోనే జరుగుతున్నాయనీ.. ఏపీలో అసలు ఇండస్ట్రీ లేకుండా పోయిందనీ పోసాని ఆవేదన వ్యక్తం చేశాడు.
నంది అవార్డుల విషయంపై కూడా పోసాని క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉన్న పోసాని.. ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నదనీ.. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అర్హులైన వాళ్ళకు నంది అవార్డులు ఇస్తామని చెప్పిన పోసాని.. ఒక వేళ ఇదివరకే ఆరోపించినట్టుగా అనర్హులకు కనుక అవార్డులు ఇస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానంటూ చాలెంజ్ చేశాడు. అలాగే పద్య నాటకాలు అనేవి కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే చెందిన కళ అనీ.. ఈ రంగంలో కూడా విశేష కృషి చేసిన వాళ్ళకు నంది అవార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పాడు. ఇక సినిమా షూటింగ్స్ విషయంలో ఇండస్ట్రీని ఏపీకి విస్తరించేందుకు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుంటే బాగుంటుందంటూ కోరాడు పోసాని.