తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను ఉరి వేసుకుంటా.. రాకపోతే నువ్వు ఉరి వేసుకుంటావా రేవంత్ రెడ్డి.. అంటూ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రేవంత్ రెడ్డిని చాలెంజ్ చేశాడు. ఆదిలాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన జోగు రామన్న.. కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ గురించి గానీ కేటీఆర్ గురించి గానీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోసేస్తానంటూ తీవ్రంగా హెచ్చరించాడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి.. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కోల్పోయాడన్నారు. ఆదిలాబాద్ లో జరిగిన అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా అంటూ సవాల్ చేశాడు జోగు రామన్న.
జోగు రామన్న వ్యాఖ్యలపై ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ రియాక్ట్ అయ్యాడు. జోగు రామన్న మాట మీద నిలబడి చావటానికి సిద్ధంగా ఉండాలనీ.. ఎందుకంటే వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేననీ చెప్పాడు సాజిద్ ఖాన్. ఓట్ల కోసం జోగు రామన్న జనం దగ్గరికి వెళ్ళినప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయనకే అర్థం అవుతుందంటూ జోష్యం చెప్పాడు సాజిద్ ఖాన్. వచ్చే సారి తాను ఓడిపోతానన్న విషయం తెలిసే భయంతో జోగు రామన్న పిచ్చి పిచ్చి చాలెంజ్ లు చేస్తున్నాడంటూ విమర్శించాడు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి ఆరోపణలు మరోసారి తెలంగాణలో రాజకీయాన్ని వేడెక్కించాయి.