బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ తన తోటి విద్యార్థినిని చితకబాదుతున్న వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. బహదూర్ పుర మహేంద్ర యూనివర్శిటీలో చదువుతున్న సాయి భగీరథ్.. తన స్నేహితులతో కలిసి ఓ విద్యార్థిపై దాడి చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై దుండిగల్ కేసు నమోదు చేసిన పోలీసులు బండి సాయి భగీరథ్ పై ఐపీసీ 341, 323, 504, 506, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బండి సంజయ్ కుమారుడు యూనివర్శిటీలో దౌర్జన్యానికి పాల్పడుతున్నాడంటూ సాయి భగీరథ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. యూనివర్శిటీలో రౌడీయిజం చేస్తున్నాడంటూ అతడిపై తిట్ల పురాణం అందుకున్నారు. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏకంగా సద్దామ్ హుస్సేన్ కొడుకుతో బండి సాయి భగీరథ్ ను పోల్చుతూ ట్వీట్ చేశాడు.
వీడియోలో దెబ్బలు తిన్న యువకుడు మరో సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తాను బండి సాయి భగీరథ్ స్నేహితుడి చెల్లెల్ని ఏడిపించాననీ.. అందుకే వాళ్ళు దాడి చేసి బుద్ధి చెప్పారే తప్ప ఇందులో మరేమీ లేదనీ.. తప్పంతా తనదేననీ చెప్పాడు. ప్రస్తుతం అవన్నీ మరిచిపోయి తామంతా కలిసిపోయామని చెప్పి పెద్ద ట్విస్టు ఇచ్చాడు. దీంతో సీన్ రివర్స్ అయ్యింది. బండి సాయి భగీరథ్ ను తిట్టిన వాళ్ళు సైలెంట్ అయిపోయారు. దీనిపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ అన్న తర్వాత విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతాయని.. కానీ ఆ గొడవలకు కారణాలు ఏమిటో కూడా తెలుసుకోకుండా తప్పుడు కోణంలో ప్రచారం చేయటం తప్పు అనీ బీజేపీ సపోర్టర్స్ అంటున్నారు. ఇంకొంత మంది.. సంగతేమిటో తెలియకుండా వీడియో చూసేసి విద్యార్థులపై కేసులు నమోదు చేయటం తప్పు అని చెప్తున్నారు.