భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు ముందే భారత్ అమెరికాల మధ్య భారీ వ్యాపార, ఆయుధ ఒప్పందాలు ఓ దారికొచ్చేస్తున్నాయి. బ్యూరోక్రాటిక్ అడ్డంకులతో పక్కన పడిన సాయుధ డ్రోన్ల విషయంలో భారత్-అమెరికా మధ్య డీల్ కుదిరినట్టు ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. ప్రస్తుతం అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సమావేశమైన జేక్.. భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందాలపై ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా నుంచి భారత్ కు సరఫరా చేయాల్సిన సెమీ కండక్టర్ డీల్ తో పాటు అనేక రక్షణ మరియు వాణిజ్య ఒప్పందాలపై చాలా వరకు చర్చలు జరిగి ఫైనల్ స్థాయిలో ఉన్నట్టు సమాచారం. త్వరలో మోదీ అమెరికా పర్యటనలో ఇరుదేశాల మధ్య అధికారికంగా ఈ ఒప్పందాలపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన సాయుధ డ్రోన్ల విషయంలో మాత్రం అమెరికా సరేనంది. 12 డ్రోన్లను భారత్ కు విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే.. ఈ ఒప్పందం భారత్ కు ఎంత పెద్ద బలమో, చైనాకు అంత పెద్ద శరాఘాతంగా చెప్పొచ్చు.
ఈ డ్రోన్లతో భారత వైమానిక శక్తి అత్యంత బలంగా మారటంతో పాటు నిఘా వ్యవస్థ కూడా బలపడినట్టు అవుతుంది. అమెరికా, భారత్ సహా చైనా చాలా దేశాలపై నిఘా వేసి ఉంచిందనీ.. వివిధ దేశాల అంతర్గత సమాచారాన్ని తస్కరించించి విశ్లేషిస్తున్నదనీ పెంటగాన్ కొద్ది రోజుల క్రితమే బహిరంగంగా చైనాపై ఆరోపణలు చేసింది. ఈ విషయంలో భారత్ చైనాపై పైచేయి సాధించినట్టు అవుతుంది. అంతే కాకుండా భారత్-చైనా సరిహద్దులో తరచుగా సైన్యాన్ని మోహరించి హద్దులు దాటి భారత్ లోకి ప్రవేశిస్తూ భారత్ ను రెచ్చగొడుతోంది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. అమెరికా-భారత్ మధ్య కీలకమై ఆయుధ ఒప్పందాలు జరిగితే అది చైనాకు ఎదురుదెబ్బ అవుతుంది. తరచూ యుద్ధ హెచ్చరికలు చేస్తూ బెదిరించే చైనాకు భారత వైమానిక వ్యవస్థ బలపడటం పరోక్ష హెచ్చరికగా మారుతుంది. అంతే కాకుండా.. రక్షణ విషయంలో భారత్ కు అగ్రదేశం అమెరికా అండదండలు ఉన్నాయనే అంశం.. చైనాను కాస్త భయపెట్టేదే. ఏది ఏమైనా.. ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాత భారత్ పరపతి మారనుందనేది మాత్రం వాస్తవం.