సుమారు ట్రక్ సైజులో ఉన్న ఓ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. ఇది భూమికి అత్యంత సమీపానికి రాబోతోందనీ.. ఇప్పటి వరకూ ఏ అంతరిక్ష వస్తువూ భూమికి ఇంత దగ్గరగా రాలేదనీ నాసా చెప్తోంది. అయితే.. దీని రాక వల్ల భూ గ్రహానికి ఎలాంటి హాని జరగబోదనీ.. భూమి చుట్టూ తిరుగుతున్న ఉపహ్రగాలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం లేదనీ నాసా చెప్తోంది. భూమి నుంచి 3600 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఆస్టరాయిడ్ దూసుకెళ్ళనుంది. ఒక వేళ ఈ గ్రహశకలం భూమ్యాకర్షణకు గురై భూమి మీద పడేందుకు కింది దిశగా దూసుకొచ్చినప్పటికీ.. ఈ వాతావరణంలోకి రాగానే అది పేలిపోతుందనీ.. చిన్న చిన్న ఉల్కలుగా మారి భూమిపై పడిపోతుందే తప్ప ఎలాంటి హాని జరిగే అవకాశం లేదని నాసా స్పష్టంగా చెప్తోంది.
క్రిమియాలోని ఓ స్పేస్ అబ్జర్వేటరీ నుంచి అంతరిక్ష పరిశోధనలు చేసే ఓ ఔత్సాహికుడు 2019లో దీన్ని గుర్తించాడనీ.. ఈ ఆస్టరాయిడ్ సూర్యుడి చుట్టూ ఒక సారి ప్రదక్షిణ చేయటానికి ప్రస్తుతానికి 359 రోజులు పడుతోందనీ.. కానీ భూమికి అతి సమీపానికి వచ్చి వెళ్ళడం వల్ల దాని వేగంలోనూ, కక్ష్యలోనూ మార్పులు జరిగి సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయటానికి పట్టే కాలం 425 రోజులకు పెరుగుతుందని చెప్పారు నాసా పరిశోధకులు.
